Monday, March 6, 2017

అట్టహాసంగా ప్రారంభమైన ఎపి అసెంబ్లీ తొలిరోజు సమావేశాలు

అట్టహాసంగా ప్రారంభమైన ఎపి అసెంబ్లీ తొలిరోజు సమావేశాలు 




పల్లెల్లో నుండి ప్రజాప్రతినిధుల కార్ల పరుగులు,,,మరోవైపు పోలీసులు హడాహుడి..,,,,అదో పండుగ వాతావరణం... ఎపి రాష్ట్రంలో సొంతగడ్డపై తొట్టతొలి అసెంబ్లీ సమావేశాల తొలిరోజు అమరావతిలో కనిపించిన చిత్రాలివి...ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు మరోవైపు, ఎమ్మెల్సీ అభ్యర్ధుల నామినేషన్ల ప్రక్రియతో వెలగపూడిలోని అసెంబ్లీ పరిసర ప్రాంతాలన్నీ కలర్ ఫుల్ గా కనిపించాయి.  రాష్ట్ర విభజన తరువాత పదేళ్ళ వరకు హైద్రాబాద్ నుండి పాలన కొనసాగాల్సి ఉన్నా, ముఖ్యమంత్రి చంద్రబునాయుడు పట్టుదలతో సొంతగడ్డ నుండే పాలనకు శ్రీకారం చుట్టారు. రెండున్నరేళ్ళ కాలంలోనే సచివాలయం తోపాటు, అసెంబ్లీ భవనాలను రాజధాని అమరావతిలో నిర్మించి పరిపాలనను ఇక్కడి నుండే చేపట్టారు. కీలకమైన బడ్జెట్ సమావేశాలతోనే అమరాతిలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు.  తొలిరోజు అసెంబ్లీ సమావేశాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి.. ఉదయం 9గగంటల ప్రాంతానికే అసెంబ్లీకి చేరుకున్న స్పీకర్ కోడెల శివప్రసాద్, అసెంబ్లీ పరిసరాలన్నీ కలియతిరుగుతూ ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు, పోలీసులకు అదేశాలు,  సూచనలు చేశారు. 9.30 గంటల నుండే  అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు , మంత్రులు ఒక్కొక్కరుగా తమ వాహనాల్లో అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. సినీనటుడు , ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అందరికంటే ముందే అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించి ఉత్సాహంగా కలియతిరిగారు. మీడియాతోను కొంత సేపు ముచ్చటించారు.  మరోవైపు ప్రధాన ప్రతిపక్షం వైసిపి విజయవాడలో తమ అధినేత జగన్ నేతృత్వంలో వైసిఎల్సీ సమావేశం నిర్వహించుకుని అధినేతతో కలసి బస్సులో అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అసెంబ్లీ గేటు బయట కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుయువత కార్యకర్తలు లోకేష్ కు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతలో అక్కడికి చేరుకున్న వైసిపి యువత కార్యకర్తలు , తెలుగు యువత కార్యకర్తలకు ధీటుగా జగన్ కు అనుకూలంగా నినాదాల హోరెత్తించారు. ఒకానొక దశలో ఇరువర్గాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్నంత పరిస్ధితులు ఎదురుకాగా పోలీసులు చాకచక్యంగా ఇరుపార్టీల యువత కార్యకర్తలను సముదాయించి అక్కడి నుండి పంపివేశారు. సరిగ్గా 11గంటల 6 నిమిషాలకు గవర్నర్ నరసింహన్ ఉభయసభల నుద్దేశించి తన ప్రసంగాన్ని కొనసాగించారు. విభజన తరువాత , ప్రభుత్వం అధికారం చేపట్టిన అనతికాలంలోనే భూసేకరణ జరిపి తాత్కాలిక రాజధాని నిర్మాణం చేపట్టం దగ్గర నుండి  ఈప్రాంత అభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతుందో గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు,  ఉపాధి, పెట్టుబడుల రాక కోసం ప్రణాళికా బద్దంగా ప్రభుత్వం ఏంచేయబోతుందో నరసింహన్ వివరించారు.
గవర్నర్ ప్రసంగం అనంతరం రేపటికి సభ వాయిదా పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి గవర్నర్ ప్రసంగంపై స్పందించారు. ఓ విజన్ తో రాష్ట్ర అభివృద్ధిని చేస్తున్నామన్నారు. తుఫాన్లు, వర్షాభావ పరిస్ధితులు రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారినప్పటికీ వాటన్నింటిని అదిగమించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గవర్నర్ ప్రసంగంలో స్పస్టత,నిబద్ధత ఉందని, ఈప్రసంగం చరిత్రలో మిగిలిపోతుందన్నారు. అదే క్రమంలో వైసిపి నేతలు గవర్నర్ ప్రసంగంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం గవర్నర్ చేత అన్నీ అబద్దాలు చెప్పిదంటూ ఆరోపించారు.
ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్ధానాలకు నామినేషన్ల ప్రక్రియ కూడా అసెంబ్లీలోనే కొనసాగింది. చంద్రబాబు తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తోపాటు, కరణం బలరామకృష్ణ మూర్తి, డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీత, బచ్చు అర్జునుడులు నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు వైసిపికి చెందిన ఇద్దరు నేతలు ఆళ్ళ నాని, గంగుల ప్రభాకర రెడ్డిలు ఎమ్మెల్యే కోటా క్రింద ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఒకవైపు అసెంబ్లీ తొలిరోజు సమావేశాలు, మరోవైపు ఎమ్మెల్సీల నామినేషన్ల ప్రక్రియతో అసెంబ్లీ ప్రాంగణమంతా సందడిగా కనిపించింది.
  మొత్తానికి తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగానే జరిగాయని చెప్పాలి...

No comments:

Post a Comment