Friday, September 9, 2016

హోదాకోసం నేడే జనసేన బహిరంగ సభ; కాకినాడ లో ఏర్పాట్లు పూర్తి 


ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ కాకినాడలో శుక్రవారం నిర్వహించనున్న బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం బుధవారం చేసిన ప్రకటనకు నిరసనగా శనివారం రాష్ట్ర బంద్‌కు విపక్షాలు పిలుపునిచ్చాయి. ప్యాకేజీపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన, విపక్షాల ఆందోళనల నడుమ ఇదే అంశంపై పవన్‌కల్యాణ్‌ నిర్వహించే సభ కీలకంగా మారింది. ఈ సభకు చిరంజీవి, పవన్‌ అభిమానులే కాకుండా, సామాజికవర్గ పరంగా పార్టీలకతీతంగా నాయకులు, కార్యకర్తలు తరలివెళుతున్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది యువకులే కావడం గమనార్హం. పవన్‌కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీ మరో ప్రజారాజ్యం పార్టీ కాకూడదని యువత కోరుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు నాందిపలుకుతుందనుకున్న ప్రజారాజ్యం పార్టీ, ఎన్నికల్లో తుస్సుమనడంతో చిరంజీవి అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.  ఈ నేపథ్యంలో శుక్రవారం కాకినాడలో శుక్రవారం బహిరంగ సభలో పవన కల్యాణ్‌ ఏం మాట్లాడతారా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

No comments:

Post a Comment