Saturday, November 5, 2016

నిబద్ధత కలిగిన ప్రొఫెసరే కాని.... నోటిదురుసు కొంపముంచింది

సంధ్యారాణి ఆత్మహత్యకు ఫ్రొఫెసర్ లక్ష్మీ వేధింపులే కారణం; ఉన్నతస్ధాయి కమిటి

గుంటూరు మెడికల్ కాలేజ్ విద్యార్ధిని సంధ్యారాణి ఆత్మహత్యకు ప్రొఫెసర్ లక్ష్మీ వేధింపులే కారణమని ఉన్నతస్ధాయి కమిటి విచారణలో తేలింది. ఆమేరకు విచారణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కళాశాలలోని ప్రొఫెసర్లు, విద్యార్ధులు, ఇతర సిబ్బందిని విచారించిన కమిటీ బృందం, ప్రొఫెసర్ లక్ష్మీపై అరోపణలు వెల్లువెత్తటం చూసి నిర్ఘాంతపోయింది. ఈనెల 24వ తేదిన గుంటూరు మెడికల్ కాలేజ్ లో రెండవ సంవత్సరం మెడికల్ పిజి విద్యార్ధిని సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈఘటన వెనుక ప్రొఫెసర్ లక్ష్మీ వేధింపులే కారణమని ఆమె రాసుకున్న సుసైడ్ నోట్ ద్వారా బయటపడింది. దీంతో వైద్య విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. 5రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించటంతోపాటు ఒకానొక దశలో ప్రభుత్వాసుపత్రిలో అత్యవసర వైద్యసేవలను నిలిపివేశారు. ఆందోళనలు ఉదృతమౌతున్న తరుణంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రంగంలోకిదిగి ప్రొఫెసర్ లక్ష్మీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించటంతోపాటు, ఉన్నతాస్ధాయి విచారణకు అదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన విచారణ కమిటి అటు ప్రభుత్వాసుపత్రి, వైద్యకళాశాలలో వైద్యులు, నర్సులు, విద్యార్ధులతోపాటు ఇతర సిబ్బందిని విచారించారు. ప్రొఫెసర్ లక్ష్మీ ప్రవర్తన తీరును అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వాహణలో ప్రొఫెసర్ లక్ష్మీ నిబద్ధతగా ఉండేదని, అయితే చిన్నవిషయాలకు సైతం అవేశానికిలోనై అందరిని ఇష్టం వచ్చినట్లు తిట్టటం, అవమానించటం లాంటివి చేసేవారని దీంతో సిబ్బందికాని, విద్యార్ధులుకాని ఆమెకు ఎదురు సమాదానం చెప్పేపరిస్ధితి లేక లోలోన మదనపడేవారని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. అత్యవసరమై సెలవులు కోరితే ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవారని మరికొందరు కమిటీకి తెలిపారు. పిజి విద్యార్ధిని సంధ్యారాణి విషయంలోను ఫ్రొఫెసర్ లక్ష్మీ ఇదే తరహాలో వ్యవహరించారని, సెలవులు అడిగినా ఇవ్వకుండా ఆమె మనస్సు నొచ్చుకునేలా వ్యవహరించారని ఈక్రమంలోనే ఆమె బలవంతంగా తనువుచాలించాల్సి వచ్చిందని పలువురు విద్యార్ధులు కమిటికి తెలిపారు. అందరిని విచారించిన ఉన్నతస్ధాయి కమిటి సంధ్యారాణి మృతికి ప్రొఫెసర్ వేధింపులే కారణమన్న నిర్ణయానికి వచ్చి ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.

ప్రొఫెసర్ లక్ష్మీకోసం కొనసాగుతున్న పోలీసుల గాలింపు...

ఇదిలా ఉంటే మరోవైపు ప్రొఫెసర్ లక్ష్మీ అచూకికోసం గుంటూరు అర్బన్ పోలీసులు విసృతస్ధాయిలో గాలింపు జరుపుతున్నారు. మొత్తం నాలుగు బృందాలు తమిళనాడు, పాండిచ్చేరి, మహరాష్ట్ర ప్రాంతాల్లో వారి అచూకి కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే లక్ష్మీపై సంస్పెండ్ వేటు పడినందున , సిసిఎ నిబంధనల ప్రకారం ఇంకా ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నదానిపై ఉన్నతాధికారులు సమాచాలోచనలు చేస్తున్నారు. అదే సమయంలో అటు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఈ ఘటనపై మెజిస్ట్రీరియల్ విచారణకు అదేశించారు. మెజిస్ట్రీరియల్ విచారణకూడా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అచార్య లక్ష్మీ గుంటూరు జిల్లాకోర్టులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటీషన్ దాఖలు చేయగా , కేసు విచారణ 7వ తేదికి వాయిదా పడింది.

మానసిక రుగ్మతే వైద్యురాలి ప్రవర్తనలో మార్పు రావటానికి కారణమా...


30 సంవత్సరాల వైద్యవృత్తిలో నిబద్ధత కలగిన వైద్యురాలిగా, క్రమశిక్షణకు మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్న ఫ్రొఫెసర్ లక్ష్మీ, గత రెండు మూడేళ్ళుగా  ఓతరహా మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. అనుకోకుండా అప్పటికప్పుడే అందరిపై నోరు పారేసుకోవటం, ఇష్టం వచ్చినట్లు కేకలు పెట్టటం , చిన్నచిన్న తప్పులకే సిబ్బందికి చీవాట్లు పెట్టటం లాంటి ఘటనలతో అక్కడి విద్యార్ధులు, సిబ్బంది అంతా ఆమె ప్రవర్తన చూపి భయకంపితులై పోయారు. సహ ప్రొఫెసర్లు సైతం ఆమెతో మాట్లాడలంటేనే భయపడే పరిస్ధితి నెలకొంది. ప్రొఫెసర్ లక్ష్మీ ప్రవర్తిస్తున్న తీరును సన్నిహితంగా ఉండే ఫ్రొఫెసర్లు ఆమె దృష్టికి కూడా తీసుకువెళ్ళగా తాను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నానో అర్ధంకావటంలేదని వారి వద్ద మధనపడి, ఒకానొకదశలో ప్రొఫెసర్ వృత్తికి రాజీనామా చేసేందుకు సిద్ధపడగా, సహ అచార్యులు వారించినట్లు  తెలుస్తుంది. ఇంతలోనే పిజి విద్యార్ధిని సంధ్యారాణి ఆత్మహత్య ఘటన చోటు చేసుకోవటంతో ఫ్రొఫెసర్ లక్ష్మీ చిక్కుల్లోపడింది.

No comments:

Post a Comment